
ముంబై, సూర్య న్యూస్ : బాలీవుడ్ యాక్షన్ మూవీ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న వేళ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సినిమాలో హీరో రణ్వీర్ సింగ్ పోషించిన హంజా పాత్ర పాకిస్తాన్ ఉగ్రవాదులను నాశనం చేస్తే రియల్ హంజా అయిన డైరెక్టర్ ఆదిత్య ధర్ ఏకంగా ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ను నాశనం చేస్తున్నాడంటూ ఆదిత్య ధర్ మరియు యామీ గౌతమ్ తో దిగిన ఫోటోను వర్మ అభిమానులతో పంచుకున్నాడు.
ఉగ్రవాదులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడికైనా పారిపోగలరు కానీ ఆదిత్య ధర్ సృష్టిస్తున్న అద్భుతం ముందు ఇతర దర్శకులు తమ సినిమాలను ఎలా కాపాడుకుంటారో అర్థం కావడం లేదంటూ వర్మ ఆసక్తికరంగా రాసుకొచ్చాడు.
గతంలో ఇదే సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ షోలే కంటే 100 రెట్లు గొప్ప సినిమా అని వర్మ కితాబివ్వడమే కాకుండా ధురంధర్ 2 ఇండియన్ సినిమాకు ఒక రీసెట్ బటన్ అని అభివర్ణించిన విషయాన్ని సినీ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా కేవలం బుద్ధిబలంతో పని చేసే అసలైన హీరోను రణ్వీర్ సింగ్ రూపంలో ఆదిత్య ధర్ పరిచయం చేశాడని అలాగే గాల్లోకి ఎగురుతూ లాజిక్ లేని ఫైట్స్ తో పాత మూస పద్ధతిలో సినిమాలు తీసే వారికి ఆదిత్య ధర్ నిజంగానే ఒక సింహస్వప్నం లాగా మారాడని ఇండస్ట్రీలో ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి.