Skip to content
Home » Kavitha New Party : కేసీఆర్ తనయ కవిత సంచలన నిర్ణయం.. రాజకీయ పార్టీగా మారనున్న ‘తెలంగాణ జాగృతి’!

Kavitha New Party : కేసీఆర్ తనయ కవిత సంచలన నిర్ణయం.. రాజకీయ పార్టీగా మారనున్న ‘తెలంగాణ జాగృతి’!

నిజామాబాద్, సూర్య న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తన భవిష్యత్తు కార్యాచరణపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణ జాగృతి సంస్థను త్వరలోనే పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మార్చబోతున్నట్లు ఆమె వెల్లడించారు. శుక్రవారం నిజామాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈ వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 25న పార్టీ జెండా, అజెండాను అధికారికంగా ప్రకటిస్తామని కవిత స్పష్టం చేశారు.

ఏప్రిల్ 25న మునీరాబాద్‌లో పార్టీ ఆవిర్భావంశ్రీరామనవమి (Sri Rama Navami) పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ ఖిల్లా రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న అనంతరం కవిత ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మునీరాబాద్ వేదికగా ఏప్రిల్ 25న ఉదయం పార్టీ ఆవిర్భావ సభను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. దేవుడి కళ్యాణం అంటే లోక కళ్యాణమేనని, ప్రజలను హత్తుకుని పరిపాలించిన శ్రీరామ చంద్రుడి స్ఫూర్తితోనే తాను రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వివరించారు.

​’సర్వోదయ తెలంగాణ’ లక్ష్యంగా కొత్త పార్టీతెలంగాణ భవిష్యత్‌ను మార్చే దారిదీపంగా తమ పార్టీ ఉండబోతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. “సర్వోదయ తెలంగాణ” (Sarvodaya Telangana) కావాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పారు. గత 20 ఏళ్లుగా తాను ప్రజల కళ్ల ముందే ఉన్నానని, తెలంగాణ వచ్చి 12 ఏళ్లు గడుస్తున్నా.. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో పూర్తి విజయం సాధించలేదన్న ఆవేదనను ఆమె వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శల బాణాలుగత బీఆర్ఎస్ (BRS) పదేళ్ల పాలనతో పాటు, ప్రస్తుత కాంగ్రెస్ (Congress) పాలనను కూడా ప్రజలు గమనిస్తున్నారని కవిత విమర్శించారు. నిత్యం సమస్యలతో బాధపడుతున్న ప్రజల పక్షాన నిలబడి పోరాడేందుకే కొత్త పార్టీ అవసరం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు, కుక్కల దాడులు వంటి ఘటనలు భద్రతా లోపాలను ఎత్తిచూపుతున్నాయని, మక్క రైతులు మద్దతు ధర కోసం నేటికీ రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొందని ఆమె మండిపడ్డారు.

​బీ టీమ్ కాదు.. ఇది తెలంగాణ ‘ఇంటి పార్టీ’!కొత్త పార్టీ పెడితే ‘బీ టీమ్’ అంటూ వచ్చే విమర్శలను కవిత కొట్టిపారేశారు. తాము ఎవరికీ బీ టీమ్ కాదని, తెలంగాణలో తమదే నంబర్ వన్ పార్టీగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది పక్కాగా తెలంగాణ ‘ఇంటి పార్టీ’గా ఎదుగుతుందన్నారు. తనను గతంలో విమర్శించిన వారైనా సరే, తెలంగాణ మీద సోయి ఉన్న ఎవరైనా తమతో కలిసి రావచ్చని ఆమె పిలుపునిచ్చారు.

ఢిల్లీలో లాబీయింగ్ చేయగల సత్తా, గల్లీలో కష్టపడే తత్వం తనకు ఉన్నాయని కవిత పేర్కొన్నారు. వారణాసిలో గంగా స్నానం చేసి, కాశీలో శివుడికి అభిషేకం చేసిన తర్వాత పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలు ఘనంగా చేపడతామని ఆమె వెల్లడించారు. మహిళలు, యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ వర్గాలందరూ ఏప్రిల్ 25న జరిగే సభకు తరలిరావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.