
న్యూఢిల్లీ, సూర్య న్యూస్: జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి చెందిన మెజారిటీ రాజ్యసభ సభ్యులు కమలం గూటికి చేరారు. పార్టీ కీలక నేత రాఘవ్ చద్దా (Raghav Chadha) నాయకత్వంలో ఏడుగురు ఎంపీలు భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరారు. ఇది అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు కోలుకోలేని దెబ్బగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
రాజ్యసభలో ఆప్ కు మొత్తం పది మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఏడుగురు సభ్యులు మూకుమ్మడిగా పార్టీని వీడారు. నిబంధనల ప్రకారం మూడింట రెండు వంతుల మంది (2/3 Majority) ఎంపీలు ఒకేసారి పార్టీ మారడంతో రాజ్యసభలో ఆప్ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనమైనట్లు అయింది. చద్దాతో పాటు ఈ జాబితాలో అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, స్వాతి మలీవాల్, విక్రమ్జిత్ సింగ్ సాహ్నీ, రాజిందర్ గుప్తా ఉన్నారు. వీరంతా ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇటీవల ఆప్ అధిష్టానం రాఘవ్ చద్దాను రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించింది. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజులకే ఆయన పార్టీని వీడటం గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీ తన ఆశయాల నుంచి పక్కకు వెళ్లిపోయిందని చద్దా విమర్శించారు. పదిహేనేళ్లుగా తాను ఆ పార్టీకి నిజాయితీగా సేవ చేశానని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ పార్టీ అవినీతిపరుల చేతుల్లో బందీ అయిందని ఆయన ఆరోపించారు. అందుకే ప్రజా సేవ కోసం సరైన వేదికను ఎంచుకుని బయటకు వచ్చినట్లు స్పష్టం చేశారు.

ఈ పరిణామంపై ఆప్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాఘవ్ చద్దా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని పార్టీ నేతలు ముందుగానే ఊహించారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఢిల్లీ మాజీ సీఎం ఆతిశీ (Atishi), ఎంపీ సంజయ్ సింగ్ గతంలోనే ఆరోపించారు. పది రోజుల క్రితం వారు చెప్పినట్లుగానే ఇప్పుడు చద్దా కాషాయ కండువా కప్పుకున్నారు. ఏదీ ఏమైనా ఈ చేరికలతో దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి.