
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన డా. బీ.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ (BRAOU) ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ జి. మేరీ సునందను విశ్వవిద్యాలయ అధికారులు ఘనంగా సన్మానించారు. గురుపూజోత్సవం సందర్భంగా విద్యా రంగానికి ఆమె చేసిన విశేష సేవలను గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఈ అవార్డును ప్రదానం చేసింది.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, తమ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకురాలు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకోవడం గర్వకారణమని ప్రశంసించారు. అవార్డు గ్రహీత ప్రొఫెసర్ మేరీ సునంద స్పందిస్తూ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని, ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.

ఈ సన్మాన కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్. విజయ కృష్ణా రెడ్డి, ప్రొఫెసర్లు డి. రబీంద్రనాథ్ సోలమన్, ఆనంద్ పవార్, పల్లవీ కాబ్దే, భోజు శ్రీనివాస్, పి. వెంకట రమణ, వడ్డాణం శ్రీనివాస్, మాధురి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. అలాగే పలు విభాగాల డైరెక్టర్లు, డీన్లు, బోధన మరియు బోధనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు కాంతం ప్రేమ్ కుమార్, విశ్వనాథ్, డాక్టర్ యకేశ్ దైద, కె. మంజుల తదితరులు ప్రొఫెసర్ మేరీ సునందను అభినందించి ఘనంగా సత్కరించారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



