
అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఇంట మరో పెళ్లి బాజా మోగనుంది. తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి (YS Anjali Reddy) వివాహం ఖాయమైనట్లు షర్మిల ఎక్స్ (Twitter) వేదికగా అధికారికంగా ప్రకటించారు. సోమల సుబ్బారెడ్డి, పద్మారెడ్డి దంపతుల కుమారుడు డాక్టర్ రఘురామ్ రెడ్డితో తన కుమార్తె పెళ్లి జరగనున్నట్లు ఆమె వెల్లడించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మనవరాలు, షర్మిల, అనిల్ కుమార్ దంపతుల కుమార్తె అయిన అంజలి రెడ్డి వివాహ వార్తతో అభిమానుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ఆరంభంలోనే షర్మిల కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కుమార్తె పెళ్లి కూడా నిశ్చయం కావడంతో వైఎస్ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. కొత్త జంటకు ఆశీస్సులు తెలుపుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందేశాలు వస్తున్నాయి.
కాబోయే అల్లుడి వివరాలపై ఆసక్తి
వైఎస్ షర్మిల కాబోయే అల్లుడు డాక్టర్ రఘురామ్ రెడ్డి నేపథ్యంపై సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఆయన అమెరికాలో స్థిరపడ్డారని కొందరు అంటుండగా, నెల్లూరు లేదా కర్నూలు జిల్లాలకు చెందిన వారని మరికొందరు ఫోటోలు పంచుకుంటున్నారు. అయితే వరుడి పూర్తి వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే వివాహ తేదీ, వేదిక ఎక్కడ అనే దానిపై కూడా అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



