
ముంబై, సూర్య న్యూస్: బాలీవుడ్ (Bollywood) ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) కుటుంబంలో పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమార్తె తన లాంగ్ టైమ్ ప్రియుడిని వివాహం చేసుకుని ఒక ఇంటిదైంది. ముంబై (Mumbai) లోని ప్రతిష్టాత్మక తాజ్ ల్యాండ్స్ ఎండ్ వేదికగా ఈ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. బోనీ కపూర్ కుమార్తెలలో జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ కాకుండా ఆయన మొదటి భార్య సంతానమైన అన్షులా కపూర్ (Anshula Kapoor) ఈ పెళ్లి పీటలు ఎక్కారు. తన ప్రియుడు రోహన్ థక్కర్ ను ఆమె వివాహం చేసుకున్నారు.
ఈ మెగా వివాహ మహోత్సవానికి కపూర్ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు, సన్నిహితులు విచ్చేసి సందడి చేశారు. పెళ్లి వేడుకల్లో అన్షులా కపూర్ బాబాయ్ అనిల్ కపూర్, సోదరీమణులు జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ఖుషీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోషల్ మీడియాలో ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 2022లో ఒక ఆన్లైన్ డేటింగ్ ప్లాట్ ఫామ్ ద్వారా మొదటిసారి కలుసుకున్న అన్షులా, రోహన్.. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. వీరు 2025 జూలైలో నిశ్చితార్థం చేసుకోగా, ఇప్పుడు వివాహ బంధంతో ఒకటయ్యారు.

నిర్మాత బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీ కపూర్ కు జన్మించిన సంతానమే నటుడు అర్జున్ కపూర్, అన్షులా కపూర్. బోనీ కపూర్, మోనా 1983లో వివాహం చేసుకోగా, కొన్ని కారణాల వల్ల 1996లో విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది స్టార్ హీరోయిన్ శ్రీదేవిని బోనీ కపూర్ రెండో వివాహం చేసుకోగా.. వారికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ జన్మించారు. మోనా శౌరీ 2012లో మరణించగా, శ్రీదేవి 2018లో కన్నుమూశారు. సవతి తల్లి కూతుర్లు అయినప్పటికీ అర్జున్, అన్షులా.. జాన్వీ, ఖుషీలతో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అందరూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటూ ఈ పెళ్లి వేడుకను ఘనంగా జరిపించారు.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




