
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం ముసుగులో నిరంకుశ పాలన సాగిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి (G Kishan Reddy) తీవ్రస్థాయిలో విమర్శించారు. అసెంబ్లీ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులను, బీజేవైఎం కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతులను నొక్కుతూ ప్రతిపక్ష నాయకులపై పోలీసులు విరుచుకుపడటం ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేంద్రమంత్రి ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకుని బారికేడ్ల వెనుక దాక్కుంటున్నారని ఆయన విమర్శించారు.
ఫీజు బకాయిలు, భూసమస్యలు పరిష్కరించాలి
రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్లో ఉన్న రూ. 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే వివాదాస్పద 22-ఎ జాబితాలో చేర్చిన ప్రైవేటు భూములపై సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తదితరులను అరెస్టు చేయడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై కనీసం ధర్నాచౌక్లో కూడా నిరసనలకు అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. కేవలం అరెస్టులు, పోలీసుల లాఠీలతో ఉద్యమాలను అణచివేయలేరని స్పష్టం చేశారు. విద్యార్థులకు, 22-ఎ భూ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన హెచ్చరించారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



