
దుబాయ్, సూర్య న్యూస్ : దుబాయ్ వేదికగా జరిగిన ఉమెన్స్ ఆసియా కప్ 2026 (Women’s Asia Cup 2026) ఫైనల్ పోరులో భారత మహిళల జట్టు (Team India) ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన తుది పోరులో శ్రీలంకపై 72 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, ఎనిమిదో సారి ఆసియా కప్ ఛాంపియన్గా అవతరించింది. 2024 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా, ఈ టోర్నీలో అజేయంగా నిలిచి సగర్వంగా టైటిల్ కైవసం చేసుకుంది.
క్రీజులో శివాలెత్తిన షెఫాలీ, స్మృతి
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరు తొలి వికెట్కు ఏకంగా 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షెఫాలీ కేవలం 39 బంతుల్లో 68 పరుగులు చేయగా, స్మృతి మంధాన 39 బంతుల్లో 59 పరుగులు చేసింది. ముఖ్యంగా షెఫాలీ వర్మ కేవలం 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి, ఆసియా కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన ప్లేయర్గా సరికొత్త రికార్డు సృష్టించింది.
శ్రీలంకను కుప్పకూల్చిన బౌలర్లు
భారత్ నిర్దేశించిన 184 పరుగుల కఠినమైన లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. భారత బౌలర్ల ధాటికి ఏ దశలోనూ కోలుకోలేక 20 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలారు. భారత బౌలర్లలో శ్రీ చరణి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు, దీప్తి శర్మ 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించారు. అలాగే క్రాంతి గౌడ్ (1/8), షెఫాలీ (1/23), ప్రేమా రావత్ (1/22) తలో వికెట్ తీసి జట్టు ఘన విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



