
హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో (Dr BR Ambedkar Open University) 2026-27 విద్యా సంవత్సరానికి గాను పలు నూతన కోర్సులతో పాటు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంఎస్సీ జాగ్రఫీ కోర్సులను ప్రవేశపెట్టినట్లు విశ్వవిద్యాలయ విద్యార్థి సేవా విభాగం (LSSB) డైరెక్టర్ డాక్టర్ వై. వెంకటేశ్వర్లు అధికారికంగా వెల్లడించారు. సికింద్రాబాద్ పీజీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన అడ్మిషన్ల ప్రచార కార్యక్రమంలో ఆయన ఈ వివరాలను పంచుకున్నారు.
వివిధ పీజీ, యూజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం ఆ ప్రింట్ కాపీని తీసుకుని, విద్యార్థులు తాము ఎంచుకున్న స్టడీ సెంటర్లో నేరుగా సంప్రదించాల్సి ఉంటుంది.
ఎంబీఏ విద్యార్థులకు కౌన్సెలింగ్
ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సుకు సంబంధించిన అడ్మిషన్ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 22వ తేదీన జూబ్లీహిల్స్లోని యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నారు. తెలంగాణ ఐసెట్ లేదా యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారు మాత్రమే ఈ కౌన్సెలింగ్కు హాజరు కావాలని స్పష్టం చేశారు. సాధారణ ఎంబీఏ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు మాత్రం నేరుగా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని ప్రవేశాలు పొందవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. మహేందర్, దాసు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



