
హైదరాబాద్, సూర్య న్యూస్: గత వారం రోజులుగా తప్పిపోయిన ఇంజినీరింగ్ విద్యార్థి (Engineering Student) రాహుల్ కథ విషాదాంతంగా ముగిసింది. తన కుమారుడు ఎక్కడైనా కనిపిస్తే చెప్పాలని ఓ తల్లి చేసిన ఆవేదన నెటిజన్లను కంటతడి పెట్టించింది. కుమారుడు క్షేమంగా తిరిగి వస్తాడని ఆశించిన ఆ తల్లిదండ్రులకు తీవ్ర విషాదం మిగిలింది. రాహుల్ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
జగిత్యాల జిల్లా (Jagtial District) కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రాహుల్ హైదరాబాద్ సైదాబాద్లోని మాతృశ్రీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతను లక్ష్మీ కళ హాస్టల్లో ఉంటూ నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో (MVSR Engineering College) ప్రాజెక్టు ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. గత నెల 27వ తేదీన టూర్కు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఒక స్నేహితుడు అతడిని కాచిగూడ రైల్వే స్టేషన్ (Kachiguda Railway Station) వద్ద దింపాడు. అక్కడి నుంచి ఎంఎంటీఎస్ (MMTS) రైలులో సికింద్రాబాద్ చేరుకున్న రాహుల్ శబరి ఎక్స్ప్రెస్లో ఒంగోలు వైపు ప్రయాణించాడు.
ఆంధ్రప్రదేశ్లోని సింగరాయకొండపల్లి రైల్వే స్టేషన్లో దిగిన రాహుల్ సమీపంలోని ఒక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న స్థానిక పోలీసులు గత నెల 30న గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేశారు. మరోవైపు రాహుల్ తండ్రి గత నెల 31న కాచిగూడ పోలీస్ స్టేషన్లో (Police Station) ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సింగరాయకొండపల్లిలో మృతదేహం లభించినట్లు నిర్ధారించారు. అయితే రాహుల్ ఆత్మహత్యకు (Suicide) దారి తీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నారు.
📲 మరిన్ని తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్స్ కోసం Surya News WhatsApp Channel లో చేరండి 👇
