
సూర్య న్యూస్: రైలు ప్రయాణం (Train Journey) చేసే సమయంలో చాలా మంది ప్రయాణికులు తమ ఇంటి నుంచి ఆహారం తీసుకెళ్లడం సాధారణం. ముఖ్యంగా కుటుంబంతో కలిసి వెళ్లేటప్పుడు బయటి ఫుడ్ తినడం కంటే ఇంటి భోజనానికే (Home Food) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో చపాతీ, పులిహోర, ఇడ్లీ లాంటివి వెంట తీసుకెళ్తారు. అయితే ఇలా రైల్లో ఇంటి నుంచి ఫుడ్ తీసుకెళ్లిన వారికి తూర్పు రైల్వే జోన్ (Eastern Railway Zone) అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు.
రైళ్లలో ఇంటి ఫుడ్ తీసుకురావడంపై ఎలాంటి నిషేధం లేదు. ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని బండిలోకి తీసుకువెళ్లవచ్చు. కానీ ప్రయాణికులు తిన్న తర్వాత చెత్తను బోగీలలో ఇష్టారీతిన పడేయడంపై రైల్వే అధికారులు (Railway Officials) సీరియస్ అయ్యారు. రైళ్లను పరిశుభ్రంగా (Hygienic) ఉంచేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగా ఒకేరోజు వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు.
📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!
తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.
📲 Join WhatsApp Channelతూర్పు రైల్వే జోన్ పరిధిలోని వివిధ స్టేషన్లు మరియు రైళ్లలో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఒక్క రోజులోనే ఏకంగా 1447 కేసులు నమోదు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి సుమారు 2 లక్షల 89 వేల 400 రూపాయల జరిమానా (Fine) వసూలు చేశారు. సీట్ల కింద, డోర్ దగ్గర, వాష్ రూమ్స్ (Washrooms) సమీపంలో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, వాటర్ బాటిల్స్ పడేసిన వారిని గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు.
ఈ తనిఖీల్లో అత్యధికంగా సీల్దా డివిజన్ (Sealdah Division) లో కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 615 మంది ప్రయాణికులపై లక్షా 23 వేల రూపాయల జరిమానా వసూలు చేశారు. అలాగే హౌరా డివిజన్ (Howrah Division) లో 457 మందిపై కేసులు నమోదు చేసి 91 వేల 400 రూపాయలు ఫైన్ వేశారు. అసన్సోల్ డివిజన్ లో 217 మంది రైలు బోగీలను చెత్తతో నింపేసినట్లు గుర్తించి వారి నుంచి 43 వేల 400 రూపాయలు వసూలు చేశారు. ఇక మాల్డా డివిజన్ లో 158 కేసులకు 31 వేల 600 రూపాయల జరిమానా విధించారు.
ప్రయాణికుల భద్రత మరియు ప్రజా ఆస్తిని కాపాడే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని రైల్వే శాఖ (Railway Department) తేల్చి చెప్పింది. భవిష్యత్తులో కూడా నిబంధనలు ఉల్లంఘించి రైళ్లను అపరిశుభ్రం చేస్తే ఇలాంటి దాడులు కొనసాగుతాయని ప్రయాణికులను తీవ్రంగా హెచ్చరించింది.



