
అఫ్గానిస్తాన్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా (Team India) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) టీ20 ఫార్మాట్లో ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానానికి చేరుకుని అరుదైన రికార్డు సృష్టించాడు.
ఈ ఏడాది అనగా 2026లో ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్లో కొనసాగుతూ 173.2 స్ట్రైక్ రేట్తో ఏకంగా 892 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ 2022లో సాధించిన 1164 పరుగులతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. 2025లో 859 పరుగులు సాధించిన అభిషేక్ శర్మ మూడో స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ (781 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (733 పరుగులు) ఆ తర్వాతి నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
ఆకట్టుకున్న బౌలర్లు
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ 37 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి మూడు వికెట్లు పడగొట్టగా, అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. బుమ్రా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
చెలరేగిన బ్యాటర్లు
అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 14.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ సంజూ శాంసన్ 57 పరుగులతో అర్ధశతకం సాధించగా, అభిషేక్ శర్మ 39 పరుగులు చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ 34 పరుగులతో, తిలక్ వర్మ 15 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును సునాయాసంగా విజయతీరాలకు చేర్చారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ మాత్రమే మూడు వికెట్లు తీశాడు. ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ అయిన ఆఖరి టీ20 మ్యాచ్ గురువారం ఇదే వేదికగా జరగనుంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



