
పాట్నా, సూర్య న్యూస్:బీహార్ రాజధాని పాట్నా (Patna) నడిబొడ్డున దుండగులు బరితెగించారు. పట్టపగలే ఒక నగల దుకాణంలోకి చొరబడి భారీ దోపిడీకి (Gold Heist) పాల్పడ్డారు. రామకృష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధన్జీ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ అలంకార్ జ్యువెలర్స్ అనే షాపులోకి ఆదివారం మధ్యాహ్నం 1:45 గంటల సమయంలో ఐదుగురు సాయుధ దుండగులు చొరబడ్డారు. హెల్మెట్లు, మాస్కులు ధరించి రెండు బైక్లపై వచ్చిన వీరు.. కత్తులు, తుపాకులతో యజమానిని, కస్టమర్లను భయభ్రాంతులకు గురిచేశారు.
దోపిడీని అడ్డుకోవడానికి ప్రయత్నించిన షాపు యజమాని ధనంజయ్ కుమార్పై దుండగులు తుపాకీ బట్లతో దాడి చేసి గాయపరిచారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే షాపులోని సుమారు 100 గ్రాముల బంగారం, 3 కేజీల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. వీటి విలువ దాదాపు 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ దృశ్యాలన్నీ షాపులోని సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
ఈ ఘటనపై ఆర్జేడీ (RJD) నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) తీవ్రంగా స్పందించారు. బీహార్లో బీజేపీ (BJP) మద్దతుతో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే నేరగాళ్లు రెచ్చిపోతున్నారని విమర్శించారు. “నేరస్థులను పట్టుకోవడానికి ముందు వారి కులాలను ఆరా తీస్తారా? లేక కేవలం మాటలతోనే నేరాలను అరికడతారా?” అంటూ సోషల్ మీడియా వేదికగా నితీష్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.