
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు సంబంధించిన ఒక ఫోటో (Rahul Gandhi viral photo) ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక మహిళ, చిన్నారితో కలిసి ఆయన పడవలో ఉన్న ఫోటోను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ (Giriraj Singh) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఎప్పుడు తీశారు, ఎక్కడ తీశారు అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ పక్కన ఉన్న మహిళ, బాలుడు ఎవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
జూన్ 22 నుంచి జులై 13 వరకు రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో ఈ ఫోటో తీసినట్లు తెలుస్తోంది. గిరిరాజ్ సింగ్ చేసిన పోస్ట్పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనటే స్పందించారు. ఫోటోలో ఉన్న మహిళ, బాలుడు రాహుల్ గాంధీ స్నేహితుడి భార్య, కుమారుడు అని ఆమె స్పష్టం చేశారు. వారు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ఫోటోను తీశారు. అయితే రాహుల్ స్నేహితుడు మాత్రం ఈ ఫోటోలో లేరని ఆమె వివరణ ఇచ్చారు.
ఈ వివాదంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించారు. ఈ ఫోటోను అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న లేక్ రే రాబర్ట్స్ (Lake Ray Roberts) వద్ద తీసినట్లు వారు వెల్లడించారు. దీనితో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ పార్టీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అనవసర రాద్ధాంతం చేయవద్దని కాంగ్రెస్ నేతలు హితవు పలికారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



