
Hyderabad, Surya News : తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతికి చిరునామాగా నిలిచిన నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం (Telugu University) ప్రాంగణాన్ని కాపాడుకునేందుకు విద్యార్థులు ఉద్యమించారు. గత నాలుగు రోజులుగా వర్సిటీ ప్రాంగణాన్ని ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను అడ్డుకుంటూ విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. తమకు ఎంతో విద్యను, అద్భుతమైన కళలను నేర్పిన ఈ సరస్వతీ నిలయాన్ని కాపాడుకోవడానికి పూర్వ విద్యార్థులు, మేధావులు, సాహితీవేత్తలు సైతం భారీ సంఖ్యలో తరలివచ్చి విద్యార్థుల నిరసనలకు బాసటగా నిలుస్తున్నారు.
ఆద్యకళకు గదుల కేటాయింపుపై అభ్యంతరం
ప్రభుత్వం ఇప్పటికే ‘ఆద్యకళ’కు (Aadyakala) రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయినప్పటికీ మల్లేపల్లి తిరుమలరావు, కోదండరాం తదితరుల ఆధ్వర్యంలోని ఆద్యకళ సంస్థకు తెలుగు విశ్వవిద్యాలయంలో స్థలాన్ని, గదులను కేటాయించే ప్రయత్నం చేయడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దశాబ్దాల చరిత్ర ఉన్న వర్సిటీ స్థలాన్ని కుదించే చర్యలు ఏమాత్రం సమంజసం కాదని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆద్యకళ ఆధీనంలో ఉన్న పాత వస్తువులు, చారిత్రక సామగ్రిని ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజియంకు తరలించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని వారు సూచిస్తున్నారు.

చాలీచాలని గదులు.. ఇబ్బందుల్లో 2500 మంది విద్యార్థులు
ప్రస్తుతం నాంపల్లి ప్రాంగణంలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిష్యం, యోగా, బి.డిజైన్, పద్యనాటకం, దూరవిద్య (Distance Education) తదితర కోర్సుల్లో 2,500 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ప్రస్తుతం ఉన్న తరగతి గదులే ఏమాత్రం సరిపోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, విద్యార్థులకు ఉపయోగపడాల్సిన గదులను ఇతర సంస్థలకు కేటాయించడం వల్ల విద్యా కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటాయని విద్యార్థి లోకం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

విద్యార్థుల హక్కులను పరిరక్షించాలి
ఆద్యకళ ఆధీనంలో ఉన్న గదులను తక్షణమే తిరిగి విశ్వవిద్యాలయానికి అప్పగించాలని, వాటిని విద్యార్థుల తరగతుల కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. “తెలుగు విశ్వవిద్యాలయాన్ని కాపాడాలి”, “నాంపల్లి ప్రాంగణాన్ని యథాతథంగా కొనసాగించాలి”, “విద్యార్థుల హక్కులను పరిరక్షించాలి” అంటూ క్యాంపస్ లో నినాదాలు మార్మోగుతున్నాయి. తెలుగు యూనివర్సిటీ కేవలం ఒక విద్యాసంస్థ మాత్రమే కాదని, అది తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని నిరసనకారులు గుర్తు చేస్తున్నారు. దానిని కాపాడుకోవడం ప్రతి తెలుగువాడి బాధ్యత అని, వర్సిటీ అభివృద్ధికి ఆటంకం కలిగించే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని మేధావులు స్పష్టం చేస్తున్నారు.




