Skip to content
Home » మీరు తినే అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలైనదేనా: మల్లేపల్లిలో కల్తీ బాగోతం రట్టు చేసిన టాస్క్ ఫోర్స్

మీరు తినే అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలైనదేనా: మల్లేపల్లిలో కల్తీ బాగోతం రట్టు చేసిన టాస్క్ ఫోర్స్

హైదరాబాద్, సూర్య న్యూస్ : హైదరాబాద్ నగరవాసుల ఆరోగ్యాన్ని హరిస్తున్న ఒక భారీ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాన్ని ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్టు రట్టు చేసి భారీగా కల్తీ మసాలాను సీజ్ చేశారు.

ప్రమాదకరమైన కెమికల్స్ తో పేస్ట్ తయారీ

హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లిలో ఉన్న షెహజాదా ఫుడ్ మాస్టర్ అనే తయారీ కేంద్రంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు, ఈ దాడుల్లో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో అసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్స్, గమ్ పౌడర్ మరియు ఉప్పు కలిపి కల్తీ పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు, దుమ్ము ధూళి మరియు ఈగల మధ్య ఈ ప్రమాదకర దందా నడుపుతున్న యూనిట్ యజమాని మహ్మద్ ఫరూఖ్ (50) ను టాస్క్ ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుంది.

కిరాణా షాపులు మరియు రెస్టారెంట్లకు సప్లై

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ అక్రమ లాభాల కోసం తయారు చేసిన ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న హోల్ సేల్ కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు మరియు కేటరింగ్ నిర్వాహకులకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సంస్థకు సంబంధించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ 2018 లోనే ముగిసిపోయినా ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారు.

లక్షల విలువైన కల్తీ మసాలా సీజ్

ఈ ఆపరేషన్ లో భాగంగా సుమారు 2.2 లక్షల రూపాయల విలువైన 1090 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు 875 కిలోల ముడి సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, వీటితో పాటు కల్తీకి వాడే రసాయనాలు, గ్రైండింగ్ యంత్రాలు మరియు ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేశారు, తదుపరి విచారణ కోసం నిందితుడిని హబీబ్ నగర్ పోలీసులకు అప్పగించి సెక్షన్ 318(4), 275 BNS కింద కేసులు నమోదు చేశారు

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.