
కూకట్పల్లి, సూర్య న్యూస్ : కూకట్పల్లి నియోజకవర్గంలోని ముసపేట భరత్ నగర్ ప్రాంతంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. స్థానిక నాయకుడు మేడ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భరత్ నగర్ ప్రాంతంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.
రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు, కూలీలు, రైతులు మరియు యువత హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన రాజకీయ అవకాశాలు కల్పించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాజకీయ మార్పు ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని, ఆ మార్పుకు TRP బలమైన వేదికగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రతి కాలనీ మరియు బస్తీ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని వెల్లడించారు.

ఈ సందర్భంగా ముసపేట డివిజన్ నుండి పెద్ద ఎత్తున యువత, స్థానిక ప్రజలు తీన్మార్ మల్లన్న సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న, స్వయంగా కార్యకర్తలకు, ప్రజలకు భోజనాలు వడ్డించి వారితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో TRP వర్కింగ్ ప్రెసిడెంట్ హరి శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు ఓదెలు యాదవ్, బొడ్డుపల్లి చంద్రశేఖర్, రమేష్ యాదవ్, రాజు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.