కోవాబన్ విక్రేతకు రూ. 25 వేల ఆర్థిక సాయం.. దాడులు చేయడం సరికాదని హితవు

అమరావతి: పొట్టకూటి కోసం కష్టపడే చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ భరోసాగా ఉంటుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. కోవాబన్ అమ్ముకునే సాధారణ పౌరుడిని కొందరు భయభ్రాంతులకు గురిచేయడం దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలు చిరువ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బాధిత వ్యాపారికి అండగా:
ఈ సంఘటన కారణంగా శివరాత్రి పర్వదినాన వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని బాధిత వ్యాపారి వలి ఆవేదన వ్యక్తం చేయగా, నాగబాబు స్పందించి వ్యక్తిగతంగా రూ. 25,000 ఆర్థిక సహాయం అందించారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారని, ఏదైనా సందేహం ఉంటే అధికారులను సంప్రదించాలి తప్ప దాడులు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.
మతం కోణంలో చూడొద్దు:
ఈ సంఘటనను మతం కోణంలో చూడవద్దని నాగబాబు కోరారు. తక్కువ లాభంతో కుటుంబాలను పోషించుకునే చిరువ్యాపారులపై జరిగిన ఈ దాడిని ఐటీ మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 40 శాతానికి పైగా పేద ప్రజలు చిరువ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాలపైనే ఆధారపడతారని, వారి పొట్ట కొట్టడం మంచి పరిణామం కాదని ఆయన హెచ్చరించారు.