
హైదరాబాద్, సూర్య న్యూస్: తెలంగాణలో అత్యవసర సేవల కోసం అమలవుతున్న డయల్ 100/112 (Dial 100/112) ఐవీఆర్ఎస్ (IVRS) విధానంపై తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC) డైరెక్టర్ కీలక స్పష్టతనిచ్చారు. అత్యవసర కాల్స్ ట్రాఫిక్ పై సమగ్ర విశ్లేషణ తర్వాతే 2019 నుండి ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐవీఆర్ఎస్ రాకముందు తెలంగాణలో ప్రతిరోజూ దాదాపు 15,00,000 కాల్స్ వచ్చేవని, అందులో సుమారు 98.7 శాతం స్పామ్ కాల్స్ (Spam calls) ఉండేవని టీజీఐసీసీసీ పేర్కొంది.
అత్యధిక సంఖ్యలో వచ్చే నకిలీ కాల్స్ వల్ల నిజమైన అత్యవసర సమయాల్లో కాల్ చేసే బాధితులకు లైన్ కలవడంలో జాప్యం జరుగుతోందని తెలంగాణ పోలీసులు గుర్తించారు. ఈ రద్దీని తగ్గించి, నిజమైన బాధితులకు వెంటనే సేవలందించే లక్ష్యంతోనే “ఎమర్జెన్సీ కోసం 1 నొక్కండి” (Press 1 for emergency) అనే ఆప్షన్ ను ప్రవేశపెట్టినట్లు డైరెక్టర్ వివరించారు. ఈ విధానం వల్ల కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే కాల్ టేకర్లు బాధితులతో అనుసంధానం అవుతారని స్పష్టం చేశారు.
ఈ ఐవీఆర్ఎస్ విధానానికి న్యాయస్థానాల మద్దతు కూడా ఉందని డైరెక్టర్ గుర్తుచేశారు. గతంలో ఢిల్లీ హైకోర్టులో దాఖలైన గంగా శరణ్ వర్సెస్ పోలీస్ కమిషనర్ కేసులో, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ల నుండి ఐవీఆర్ఎస్ ను తొలగించాలన్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఒక కీ నొక్కడానికి పట్టే సెకన్ల సమయం జాప్యం కిందకు రాదని, ఐవీఆర్ఎస్ తొలగిస్తే సిస్టమ్ ఓవర్ లోడ్ అయ్యే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడినట్లు తెలిపారు. ఈ వ్యవస్థ బాధితులకు ఇబ్బంది కలిగించడానికి కాదు, వేగవంతమైన మరియు నమ్మకమైన పోలీసు సేవలను అందించడానికేనని తెలంగాణ పోలీసులు (Telangana Police) పునరుద్ఘాటించారు.