
హైదరాబాద్, సూర్య న్యూస్: వట్టినాగులపల్లిలో (Vattinagulapally) అధికార పార్టీ నాయకుల భూకబ్జాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) కుమారుడు ఈ కబ్జాలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆరోపణలు చేశారు. వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేల బృందం వట్టినాగులపల్లికి చేరుకుంది. అక్కడ బాధితులతో మాట్లాడిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు.
అధికారులను అడ్డుపెట్టుకుని కొందరు నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి ఎకరాల భూమిని ప్రభుత్వం ఏకపక్షంగా నిషేధిత జాబితాలో (Prohibited list) చేర్చిందని ఆయన విమర్శించారు. ఆ తర్వాత రైతులు, సామాన్య ప్రజలను బెదిరింపులకు గురిచేస్తూ భూదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ భూకబ్జాల బారిన పడిన బాధితులు నేరుగా తమ వద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో పోరాటం చేయనుంది. త్వరలోనే రాష్ట్ర గవర్నర్ ను (Governor) కలిసి ఈ భూకబ్జాలపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వెల్లడించింది.