Skip to content
Home » Automobile News : హైవే ప్రయాణికులకు బిగ్ షాక్.. పెరగనున్న ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు.. పాత ధరకే పొందాలంటే..

Automobile News : హైవే ప్రయాణికులకు బిగ్ షాక్.. పెరగనున్న ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు.. పాత ధరకే పొందాలంటే..

​New Delhi, Surya News: నేషనల్ హైవేలపై (National Highways) నిత్యం ప్రయాణించే వాహనదారులకు ఇది చేదు వార్త. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ (FASTag Annual Pass) ధరను పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సంచలన నిర్ణయం తీసుకుంది. టోల్ టాక్స్ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ వార్షిక పాస్‌లను వాడుతున్న లక్షలాది మంది ప్రైవేట్ వాహన యజమానులపై దీని ప్రభావం పడనుంది.

ప్రస్తుతం ప్రైవేట్ వాహనాలకు ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర రూ. 3,000గా ఉంది. కానీ ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ పాస్ ధర రూ. 3,075కి పెరగనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం నుండి దేశవ్యాప్తంగా ఈ పెరిగిన కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. 2025 ఆగస్టు 15న ఈ వార్షిక పాస్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇది ఎంతో మందికి ఉపయోగకరంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 56 లక్షల వాహనాలు ఈ యాన్యువల్ పాస్ ద్వారా నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఎటువంటి ఇబ్బంది లేకుండా టోల్ చెల్లింపులు (Toll Payments) చేస్తున్నాయి.

కొత్త ధరలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న నేపథ్యంలో, వాహనదారులు ఇప్పటికీ పాత ధరకే పాస్‌ను కొనుగోలు చేసి డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంది. మీ పాస్ రినవల్ (Renewal) గడువు దగ్గర పడుతున్నా, లేదా కొత్తగా పాస్ తీసుకోవాలనుకున్నా మార్చి 31వ తేదీ రాత్రి 11:59 గంటల లోపు పాత ధరకే (రూ. 3,000) కొనుగోలు చేయవచ్చు. తద్వారా మీరు పెరిగిన అదనపు భారం రూ. 75ని ఆదా చేసుకోవచ్చు.

​ఈ పాస్‌ను వాహనదారులు ఇంటి నుండే NHAI అధికారిక వెబ్‌సైట్ లేదా ‘రాజమార్గ యాత్ర’ (Rajmarg Yatra) యాప్ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. వెబ్‌సైట్ ద్వారా అయితే ముందుగా మీ వివరాలతో లాగిన్ అయి, ‘FASTag Annual Pass’ ఆప్షన్‌ను ఎంచుకుని వాహన వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ చేయాలి. యాప్ ద్వారా అయితే రాజమార్గ యాత్ర యాప్‌లో మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి, ఫాస్టాగ్ ఖాతాను లింక్ చేసి పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. పేమెంట్ సక్సెస్ అయిన వెంటనే మీ వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.