
Visakhapatnam, Surya News: విశాఖపట్నంలో (Visakhapatnam) అత్యంత దారుణమైన హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఒక నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని కిరాతకంగా చంపి శరీర భాగాలను ఫ్రిజ్లో దాచిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటన గాజువాక పరిధిలోని ఎల్బీ నగర్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్లో జరిగింది. సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు నిందితుడు వేసిన పథకం పోలీసుల విచారణలో బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు చింతాడ రవీంద్ర (30) ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా (Indian Navy Technician) పనిచేస్తున్నాడు. అతనికి 2021లో ఒక డేటింగ్ యాప్ (Dating App) ద్వారా తాటిచెట్లపాలెంకు చెందిన పి. మౌనిక (31) అనే యువతితో పరిచయం ఏర్పడింది. రవీంద్ర 2024లో మరో మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత కూడా అతను మౌనికతో తన వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఇటీవల రవీంద్ర భార్య కాన్పు నిమిత్తం తన పుట్టింటికి వెళ్లింది.
భార్య ఇంట్లో లేని సమయం చూసి ఆదివారం మధ్యాహ్నం రవీంద్ర మౌనికను తన ఫ్లాట్ కు పిలిపించుకున్నాడు. అక్కడ ఇద్దరి మధ్య డబ్బు విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ కోపంలో రవీంద్ర ఆమెను సోఫా పైకి తోసి ఊపిరి ఆడకుండా నొక్కి పెట్టి హత్య చేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆన్లైన్లో ముందుగానే కొనుగోలు చేసిన ఒక పదునైన కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు.