
అమెరికా, సూర్య న్యూస్: వైఎస్సార్సీపీ (YSRCP) నాయకురాలు, మాజీ మంత్రి రోజా (Roja) కుమార్తె అన్షు మాలిక సెల్వమణి (Anshumalika Selvamani) అమెరికాలో అరుదైన ఘనత సాధించారు. ఇండియానా యూనివర్సిటీ (Indiana University) అందించే అత్యున్నత పురస్కారం ‘హెర్మన్ బి వెల్స్’ (Herman B Wells Award 2026) అవార్డును ఆమె అందుకున్నారు. విద్యారంగంలో అన్షు మాలిక కనబరిచిన అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఈ విషయాన్ని రోజా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తన కుమార్తె సాధించిన విజయం పట్ల ఎమోషనల్ అయ్యారు.
అన్షు మాలిక ప్రస్తుతం అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీకి చెందిన లూడీ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటింగ్ అండ్ ఇంజినీరింగ్లో కంప్యూటర్ సైన్స్ (Computer Science) అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు. కేవలం చదువులోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. ఏడేళ్ల వయసు నుంచే కోడింగ్ నేర్చుకున్న అన్షు, ‘ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్’ (The Flame in My Heart) అనే పుస్తకాన్ని కూడా రచించారు. గతంలో నైజీరియాలో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫెస్టివల్లోనూ ఆమె ‘సోషల్ ఇంపాక్ట్’ విభాగంలో అవార్డు గెలుచుకోవడం విశేషం.
హెర్మన్ బి వెల్స్ అవార్డు అనేది ఇండియానా యూనివర్సిటీ మాజీ ప్రెసిడెంట్ జ్ఞాపకార్థం అందించే అత్యున్నత గౌరవం. అకాడమిక్ ఎక్సలెన్స్, పబ్లిక్ సర్వీస్ మరియు నాయకత్వ లక్షణాలు కలిగిన విద్యార్థులకు మాత్రమే ఈ పురస్కారాన్ని అందజేస్తారు. భవిష్యత్తులో గొప్ప సైంటిస్ట్ (Scientist) కావాలనే లక్ష్యంతో అన్షు మాలిక ముందుకు సాగుతుండటం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.