
వాషింగ్టన్, సూర్య న్యూస్: ప్రపంచాన్ని సంక్షోభం అంచున నిలిపిన అమెరికా-ఇరాన్ (US-Iran) యుద్ధానికి ఎట్టకేలకు ముగింపు లభించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన చర్చల అనంతరం రెండు దేశాలు శాశ్వత శాంతి ఒప్పందానికి (Peace Treaty) వచ్చినట్లు సౌదీ అరేబియా (Saudi Arabia) మీడియా సంస్థ అల్ హదత్ (Al Hadath) శుక్రవారం వెల్లడించింది. అయితే ఈ శాంతి సంధిపై అటు అమెరికా (USA) నుంచి కానీ ఇటు ఇరాన్ (Iran) నుంచి కానీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ (Pakistan) నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇంతకాలం చర్చల్లో ప్రతిష్టంభనకు కారణమైన ఇరాన్ అణుకార్యక్రమం (Nuclear Program), అమెరికా ఆంక్షల ప్రస్తావన లేకుండానే తుది ఒప్పందం కుదిరినట్లు అల్ హదత్ పేర్కొంది. శాంతి ఒప్పందం తుది ముసాయిదా ఖరారైందన్న వార్తల నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు (Pak Army Chief) అసిమ్ మునీర్ శుక్రవారం రాత్రి హుటాహుటిన ఇరాన్ రాజధాని టెహ్రాన్ (Tehran) చేరుకున్నారు. పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహసిన్ నఖ్వీ కొద్దిరోజులుగా ఇరాన్ లోనే మకాం వేశారు. వీరు ఇరాన్ అగ్రనాయకులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు.
ఇరాన్ అణ్వాయుధాలు తయారుచేస్తోందని ఆరోపిస్తూ అమెరికా, ఇజ్రాయెల్ (Israel) సంయుక్తంగా ఫిబ్రవరి 28న ఇరాన్ పై సైనిక చర్య ప్రారంభించాయి. ఆ రెండు దేశాలు ఇరాన్ పై భీకర వైమానిక దాడులు చేశాయి. ఇరాన్ కూడా తీవ్రంగా ఎదురుదాడి చేసింది. పశ్చిమాసియాలోని అమెరికా మిత్రదేశాలైన సౌదీ అరేబియా, ఖతర్ (Qatar), యూఏఈ (UAE) లతో పాటు ఇజ్రాయెల్ పై క్షిపణులు (Missiles), డ్రోన్లతో విరుచుకుపడింది. ఏప్రిల్ 8న అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదరటంతో యుద్ధం తాత్కాలికంగా ఆగిపోయింది. అప్పటి నుంచి పాక్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. ఇస్లామాబాద్ లో (Islamabad) ముఖాముఖి జరిగిన చర్చలు విఫలమైన తర్వాత పలు దఫాలుగా పరోక్ష చర్చలు జరిగాయి.
ఒప్పందంలోని ప్రధాన అంశాలు పరిశీలిస్తే ఇరు దేశాలపై మిలిటరీ, పౌరులు, ఆర్థిక మౌలిక వసతులపై దాడులు చేసుకోకూడదు. అన్నిరకాల సైనిక చర్యలను వెంటనే నిలిపివేయాలి. మీడియా దుష్ప్రచారానికి కూడా అడ్డుకట్ట వేయాలి. ఇరు దేశాలు ఎదుటి దేశ సార్వభౌమాధికారం (Sovereignty), అంతర్గత సమగ్రతను గౌరవించాలి. ఒక దేశం మరో దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ లో స్వేచ్ఛాయుత నౌకాయానానికి హామీ ఇవ్వాలి. వివాదాల పరిష్కారానికి సంయుక్త వ్యవస్థను (Joint Mechanism) ఏర్పాటు చేయాలి. అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఏడు రోజుల్లో చర్చలు ప్రారంభించాలి. ఈ ఒప్పందంలోని అంశాలకు ఇరాన్ ఏ మేరకు కట్టుబడి ఉంటుందన్నదానిపై ఆధారపడి ఆ దేశంపై అమెరికా క్రమంగా ఆర్థిక ఆంక్షలను (Economic Sanctions) తొలగిస్తుంది.