
Amaravati, Surya News: రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. సచివాలయంలో రాజధాని నిర్మాణ పనులపై కాంట్రాక్ట్ సంస్థలు, అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక సూచనలు చేశారు. అమరావతి అంటే కేవలం 29 గ్రామాల సమూహం మాత్రమే కాదని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ, గుంటూరు నగరాలను కూడా కలుపుకుని సమగ్ర రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఆయన తెలిపారు. అమరావతి అభివృద్ధి ప్రణాళికలో (Development Plan) విజయవాడ, గుంటూరు నగరాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
నెలకు 7.92 శాతం పురోగతి సాధించాలి
రాజధానిలో ప్రస్తుతం 95 ప్రాజెక్టులకు సంబంధించి రూ.50,999 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ పనుల్లో ప్రతి నెల కనీసం 7.92 శాతం పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. నిర్ణయించిన గడువులోగా ప్రతి ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో స్పీడ్, క్వాలిటీ, డెలివరీ ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని ఆయన అన్నారు. ఇప్పటికే పనుల వేగం కొంత పెరిగినా ఇంకా మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. రాజధాని నిర్మాణం చేపట్టడం నిర్మాణ సంస్థలకు ఒక గొప్ప అవకాశం అని చెప్పారు. ఆ అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.
నిధుల కొరత లేదు.. ఇక నేనే స్వయంగా పర్యవేక్షిస్తా
ప్రభుత్వం నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు. అందువల్ల పనుల్లో ఆలస్యం జరిగే పరిస్థితి ఉండకూడదని హెచ్చరించారు. భూసేకరణ, నిధుల సమీకరణ, అనుమతులు, డిజైన్ల ఆమోదం వంటి అంశాల్లో అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు కూడా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కరించి పనులు ఆగకుండా చూడాలని సూచించారు. రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనం పెంపు, ఆధునిక మౌలిక వసతుల అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనులను ఇకపై తాను కూడా స్వయంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తయితే ప్రపంచ స్థాయి రాజధానిగా (World Class Capital) అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యం సాధ్యమవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




