
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో (BJP National Executive Meeting) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. కొత్తగా నియమితులైన జాతీయ కార్యవర్గ సభ్యులతో దాదాపు 5 గంటల పాటు ముఖాముఖిగా సమావేశమైన ఆయన.. సంస్థాగత బలోపేతం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, పార్టీ సిద్ధాంతాలను సామాన్యులకు ఎలా చేరువ చేయాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
పదవులకే పరిమితం కావొద్దు.. ప్రజల్లో ఉండాలి!
ఈ ఐదు గంటల భేటీలో ప్రధాని మోడీ ప్రతి నాయకుడితో వ్యక్తిగతంగా పరిచయం పెంచుకోవడమే కాకుండా, వారి గత అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. నాయకులు కేవలం పదవులకే పరిమితం కాకుండా, క్షేత్ర స్థాయిలో నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారితో మమేకం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను ఓపికగా విని, ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. “సేవ, సుపరిపాలన” అనేదే బీజేపీ ప్రధాన అజెండా అని స్పష్టం చేసిన మోడీ.. సామాన్య ప్రజలకు, పార్టీకి మధ్య ఉన్న బంధాన్ని మరింత దృఢంగా మార్చడమే ఏకైక లక్ష్యంగా అడుగులు వేయాలని ఉద్బోధించారు.

అక్టోబర్ నాటికి 25 ఏళ్ల ప్రజా జీవితం.. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు
2001 అక్టోబర్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ, 2026 అక్టోబర్ నాటికి ఒక ముఖ్య రాజ్యాంగ పదవిలో ఉంటూ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేశ ప్రధానిగా ఆయన అందించిన నిస్వార్థ సేవలు, పేదల కోసం తీసుకొచ్చిన సంస్కరణలు, సాధించిన విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు బీజేపీ అధిష్టానం ఒక పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసింది. ఆయన ఎదుర్కొన్న క్లిష్టమైన సవాళ్లు, దేశాభివృద్ధి కోసం తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను వివరిస్తూ దేశవ్యాప్తంగా డిజిటల్, ఫోటో ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.
నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’
ప్రధాని 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ సంస్థాగతంగా భారీ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్లో ప్రధాని మోడీ పుట్టినరోజు నుంచి అక్టోబర్ వరకు “సేవా సంకల్ప్ అభియాన్” (Seva Sankalp Abhiyan) లేదా “సేవా సంకల్ప్ మహోత్సవ్” పేరిట ఈ కార్యక్రమాలు నిరంతరాయంగా జరగనున్నాయి.

క్షేత్రస్థాయి కార్యక్రమాలు:
ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతి గ్రామం, పల్లె, పట్టణాల్లో భారీ ఎత్తున స్వచ్ఛ భారత్, రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరాలు నిర్వహించనున్నారు.
మాతృ సంవాద్:
క్షేత్ర స్థాయిలో నిరంతరం శ్రమిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను ప్రత్యేకంగా సత్కరించేందుకు ‘మాతృ సంవాద్’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
యువత కోసం ‘సేవలో నా భాగస్వామ్యం’ – ‘నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్’సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు బీజేపీ కొత్త కార్యక్రమాలను ప్రకటించింది.
సేవలో నా భాగస్వామ్యం (Seva Mein Mera Yogdan):
యువత తాము చేసే సేవా కార్యక్రమాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో పంచుకునేలా ప్రోత్సహించనున్నారు.
నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్:
విద్యార్థులు, యువత తమ స్థానిక సమస్యల పరిష్కారానికి తమ వంతు ఆలోచనలు పంచుకునేలా ఈ ఛాలెంజ్ను ప్రవేశపెట్టనున్నారు.
దీని ద్వారా దేశ యువతలో నాయకత్వ లక్షణాలను, సేవా భావాన్ని పెంపొందించవచ్చని బీజేపీ భావిస్తోంది. మొత్తానికి మోడీ నాయకత్వ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సానుకూల దృక్పథాన్ని, సేవా దృక్పథాన్ని నెలకొల్పడానికి బీజేపీ సన్నాహాలు ముమ్మరం చేసింది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




