
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమెపై తదుపరి చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం (Congress High Command) అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఈ అంశంపై చర్చలు జరిపారు. సీనియర్ నేతల అభిప్రాయాలు, తాజా పరిణామాలను పూర్తిగా పరిశీలించిన అనంతరమే అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే, ఈ వ్యవహారంలో అనూహ్యంగా ఆమెకు పార్టీ అంతర్గత వర్గాల నుంచి భారీ మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు పీసీసీకి చెందిన ఒక ముఖ్య నేత సురేఖకు అండగా నిలిచినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటే బీసీ సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఈ నేతలు ఆమెకు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.
ఈ తాజా పరిణామాలతో సురేఖకు అధిష్టానం నుంచి సానుకూల స్పందన లభిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏఐసీసీ నేత మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులతో జరిగే భేటీల అనంతరం సురేఖ భవితవ్యంపై మరింత స్పష్టత రానుంది. అధిష్టానం మద్దతు లభిస్తుండటంతో ఆమె మంత్రివర్గంలో కొనసాగుతారా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



