
శాసనమండలి వేదికగా సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని దయనీయ పరిస్థితులు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్యలపై ఆయన ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు.
నిలోఫర్ వద్ద మెడికల్ మాఫియా.. జిల్లాల్లో సౌకర్యాల లేమి
జిల్లా, ఏరియా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో 2డీ ఎకో, ఎంఆర్ఐ వంటి కనీస సదుపాయాలు లేక రోగులు 200 కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్కు రావాల్సి వస్తోందని ఎమ్మెల్సీ సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రిలో కనీస మందులు దొరకని పరిస్థితి నెలకొందని, ఇదే అదునుగా బయట ఉన్న మెడికల్ షాపుల వారు రూ.200 విలువైన మందులను రూ.500 నుంచి రూ.1000కి అమ్ముతూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. తక్షణమే ఆసుపత్రుల్లో అడ్వైజరీ కమిటీలు పునరుద్ధరించి, మందుల కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై కేసులు పెట్టాలి
ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయని ఆయన సభ దృష్టికి తెచ్చారు. ఫీజులు చెల్లించలేదనే సాకుతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని, అలాంటి వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్సీ సత్యం డిమాండ్ చేశారు. విద్యను సామాజిక బాధ్యతగా గుర్తించి, ప్రభుత్వం వెంటనే ఫీజుల బకాయిలను విడుదల చేయాలని ఆయన కోరారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



