
హైదరాబాద్, సూర్య న్యూస్ : రాష్ట్ర మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోదరులకు సంబంధించిన మంచిరేవుల భూకుంభకోణాన్ని సురేఖ కుమార్తె బయటపెట్టడం వల్లే ఆమెను మంత్రివర్గం నుంచి అకస్మాత్తుగా తప్పించారని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య వాటాలు, పర్సంటేజీల కోసం నిరంతరం ఆధిపత్య పోరు నడుస్తోందని ఆయన విమర్శించారు. నిషేధిత భూముల జాబితాను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కలిసి పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా కమీషన్ల కోసం కక్కుర్తి పడే పాలన కొనసాగుతోందని ఆయన ఎద్దేవా చేశారు.
‘తమ్ముడు.. లెట్స్ డూ కుమ్ముడు’
ప్రస్తుత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, కేవలం భూదందాలు మాత్రమే లక్ష్యంగా సాగుతోందని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలన మొత్తం ‘తమ్ముడు.. లెట్స్ డూ కుమ్ముడు’ అనే తరహాలో సాగుతోందని సెటైర్లు వేశారు. ప్రభుత్వంలోని పెద్దల భూదందాలను, అవినీతిని ఎవరు ప్రశ్నించినా వారిని పదవుల నుంచి తొలగిస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మొత్తం భూవ్యవహారంపై స్పష్టమైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



