
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలుగు జానపద పరిశ్రమలో చోటుచేసుకున్న వివాదం విషాదాంతంగా మారింది. ప్రముఖ సింగర్ ఈశ్వర్ సాయి (Eeshwar Sai), మాధురి రాథోడ్ (Madhuri Rathod) మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఆత్మహత్యకు యత్నించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఆత్మహత్యకు పాల్పడటానికి కొన్ని క్షణాల ముందు శరణ్య ఒక ఆడియో మెసేజ్ విడుదల చేశారు. ఈ పోరాటంలో తాను పూర్తిగా మోసపోయానని, ఈశ్వర్ లేకుండా తాను బతకలేనని ఆ ఆడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితాన్ని అందరూ కలిసి నాశనం చేశారని, అందుకే తనకు చావు ఒక్కటే మార్గంగా కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ ద్రోహాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతూ, దయచేసి తన కొడుకుని జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె కోరారు.
ఈ ఆడియో బయటకు వచ్చిన కొద్దిసేపటికే శరణ్య అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్నారని, ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం అందుతోంది.
గత కొంతకాలంగా ఈశ్వర్ సాయి, సింగర్ మాధురి రాథోడ్ మధ్య వ్యక్తిగత గొడవలు జరుగుతున్నాయి. పెళ్లి పేరుతో తనను ఈశ్వర్ సాయి మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల బంధం మధ్యలోకి వచ్చిన వివాదం, సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగానే శరణ్య ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



