Skip to content
Home » Bandi Sanjay Son POCSO Case : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు, తెరపైకి హనీ ట్రాప్

Bandi Sanjay Son POCSO Case : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు, తెరపైకి హనీ ట్రాప్

Hyderabad, Surya News: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి (Union Minister) బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై పోక్సో కేసు (POCSO Case) నమోదైంది. ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడన్న ఆరోపణలతో పేట్ బషీరాబాద్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బాధిత 17 ఏళ్ల మైనర్ బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారం గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన మొయినాబాద్ (Moinabad) లోని ఒక ఫామ్ హౌస్ లో ఈ దారుణం జరిగింది. సాయి భగీరథ్ ఆ బాలికకు బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బీఎన్ఎస్ఎస్ సెక్షన్లు 74, 75 తో పాటు పోక్సో యాక్ట్ (POCSO Act) సెక్షన్ 11 ఆర్/డబ్ల్యూ 12 కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. భగీరథ్ చేసిన వేధింపులు తట్టుకోలేక ఆ బాలిక తీవ్ర మనస్తాపానికి గురై రెండుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

​మైనర్ బాలికకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని భగీరథ్ బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు. అయితే ఈ కేసులో అనూహ్యంగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పోక్సో కేసు నమోదు కావడానికి ఒక రోజు ముందే కరీంనగర్ (Karimnagar) టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సాయి భగీరథ్ ఒక ఫిర్యాదు చేశాడు. తనను ఆ మైనర్ బాలిక కుటుంబం హనీ ట్రాప్ (Honey Trap) చేసిందని అందులో ఆరోపించాడు.

స్నేహం పేరుతో వలవేసి పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని భగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను నిరాకరించడంతో ప్రైవేట్ వీడియోలు చూపి బ్లాక్ మెయిల్ (Blackmail) చేస్తున్నారని తెలిపాడు. ఏకంగా ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారని వెల్లడించాడు. ఇప్పటికే ఆ బాలిక తండ్రికి తాను యాభై వేల రూపాయలు చెల్లించినట్లు వివరించాడు.

ప్రస్తుతం ఈ రెండు వేర్వేరు ఫిర్యాదులపై రెండు నగరాల పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ పోలీసులు పోక్సో కేసును దర్యాప్తు చేస్తుండగా కరీంనగర్ పోలీసులు హనీ ట్రాప్ కోణంలో శాస్త్రీయ ఆధారాలు సేకరిస్తున్నారు. సాయి భగీరథ్ గతంలో మహింద్రా యూనివర్సిటీ (Mahindra University) లో తోటి విద్యార్థిపై దాడి చేసిన ఘటనలో కూడా వివాదాల్లో నిలిచాడు. ఇప్పుడు ఏకంగా పోక్సో కేసు నమోదు కావడంతో విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.