
Hyderabad, Surya News: తమిళనాడు అసెంబ్లీలో (Tamil Nadu Assembly) నేడు టీవీకే అధినేత, సీఎం జోసెఫ్ విజయ్ (CM Joseph Vijay) మరియు ప్రతిపక్ష డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ మధ్య వాడివేడి సంవాదం జరిగింది. గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా సీఎం విజయ్ ప్రతిపక్ష డీఎంకేపై పలు విమర్శలు గుప్పించారు. పార్టీ ఫండ్స్ పేరిట డీఎంకే డబ్బులు కూడబెట్టుకుంటోందని సీఎం ఆరోపించారు. దీంతో ప్రతిపక్షం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆరోపణలకు తగిన ఆధారాలు చూపించాలని డీఎంకే డిమాండ్ చేయడంతో పాటు సీఎం వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేసింది.
ఎన్నికల అనంతరం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడాన్ని సీఎం విజయ్ సమర్థించుకున్నారు. డబ్బులతో ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారన్న డీఎంకే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలను తామే టీవీకే వద్దకు పంపించామని చెప్పుకుంటున్న డీఎంకే, మరోవైపు డబ్బులతో మద్దతు కూడగట్టామని నిందలేస్తోందని సీఎం ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల ఆరోపణల్లో పసలేదని, కేవలం తమపై దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని అన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మద్దతు లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా డీఎంకే అధినేత స్టాలిన్ను గుర్తుకు తెస్తూ వ్యవహారం ముగిసిందనే అర్థం వచ్చేలా సీఎం చేతితో సైగలు చేశారు.
సీఎం విజయ్ చేసిన ఈ సైగలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఈ చర్యతో టీవీకే ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున బల్లలు చరుస్తూ సీఎం విజయ్కు మద్దతు తెలిపారు. అయితే గతంలో స్టాలిన్ కూడా సరిగ్గా ఇదే తరహా సైగలు చేయడం విశేషం. కాంగ్రెస్ తో సీట్ల పంపకాల చర్చల అనంతరం డీఎంకే కార్యాలయం నుంచి తిరిగివెళ్లే సందర్భంలో ‘మ్యాటర్ సెటిలైంది’ అనే అర్థం వచ్చేలా చేతిని ఊపుతూ ఆయన మీడియాకు ఫోజు ఇచ్చారు.
అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. సీట్ల పంపకం కొలిక్కి వచ్చిందనే ఉద్దేశంతోనే తాను ఈ సైగలు చేశానని, అంతకుమించి మరే ఉద్దేశం లేదని స్టాలిన్ అప్పట్లో వివరణ ఇచ్చారు. ఇప్పుడు అచ్చం అలాగే సీఎం విజయ్ కూడా అసెంబ్లీ వేదికగా సైగలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




