
చెన్నై, సూర్య న్యూస్: తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న టీవీకే (TVK) అధినేత విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్ర గవర్నర్ (Governor) అధికారికంగా ఆహ్వానించారు. ఈ మేరకు రాజ్ భవన్ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు విజయ్ (Thalapathy Vijay) గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని ఇప్పటికే కాంగ్రెస్ (Congress) పార్టీ బహిరంగంగా ప్రకటించింది. అన్నాడీఎంకే (AIADMK) పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా విజయ్కి మద్దతు ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో పార్టీ బలాన్ని నిరూపించుకోవడం విజయ్కి సులభమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఏకంగా 108 స్థానాల్లో ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి మరో 10 మంది ఎమ్మెల్యేల (MLAs) మద్దతు మాత్రమే ఆ పార్టీకి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో విజయ్కి మద్దతు ఇచ్చేందుకు వివిధ పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Vishwanath Arlekar) స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి టీవీకే నుండి తనకు ఒక లేఖ అందిందని ఆయన స్పష్టం చేశారు. తమకు తగినంత మెజారిటీ ఉందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని టీవీకే నేతలు కోరినట్లు గవర్నర్ తెలిపారు. ఈరోజు సాయంత్రం సమావేశం కోసం విజయ్ తన అపాయింట్మెంట్ కోరారని ఆయన వెల్లడించారు. త్వరలోనే తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని ఆయన స్పష్టం చేశారు.