Skip to content
Home » TELANGANA : ఏప్రిల్ రెండో వారంలో ‘దోస్త్’ నోటిఫికేషన్: డిగ్రీలో సమూల మార్పులు, భారీగా కొత్త కోర్సులు

TELANGANA : ఏప్రిల్ రెండో వారంలో ‘దోస్త్’ నోటిఫికేషన్: డిగ్రీలో సమూల మార్పులు, భారీగా కొత్త కోర్సులు

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఏప్రిల్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ (DOST) నోటిఫికేషన్ రెండో వారంలో వెలువడనుంది. ఈ విద్యా సంవత్సరం నుండి డిగ్రీ కోర్సుల్లో సమూల మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మారుతున్న పరిశ్రమల అవసరాలు మరియు యువత ఆకాంక్షలకు అనుగుణంగా 2026-27 విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

ఈ నూతన విధానంలో భాగంగా బిఎస్సిలో 9, బిబిఎలో 5, బి.కాంలో 3, బి.ఎలో 2 కోర్సులతో పాటు బిఎస్సి ఆనర్స్ నాలుగేళ్ల కోర్సులోనూ కొత్త సబ్జెక్టులు ప్రవేశపెడుతున్నారు. గతంలో ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సీట్లు రాని విద్యార్థులు మాత్రమే డిగ్రీలో చేరేవారనే భావన ఉండేది. కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా మరియు ఆచరణాత్మక విద్యకు పెద్దపీట వేసేలా సిలబస్‌ను రూపొందించారు.

ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసినా ఇంగ్లీష్ ప్రావీణ్యం మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం ఇంగ్లీష్ సబ్జెక్టులో భారీ మార్పులు చేశారు. మూస పద్ధతికి స్వస్తి పలికి సాంకేతికతను జోడించి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా విద్యామండలి కసరత్తు చేస్తోంది. డిగ్రీ చదువుతూనే ఉపాధి అవకాశాలు పొందేలా ఈ నూతన కోర్సులు దోహదపడనున్నాయి.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.