
చెన్నై, సూర్య న్యూస్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (Tamil Nadu Assembly Elections) వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ (BJP) ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నామలై (Annamalai) పేరు లేకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది. ఆయన పార్టీకి దూరం అవుతున్నారంటూ వస్తున్న ఊహాగానాలపై అన్నామలై స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు.
చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన అన్నామలై తనపై వస్తున్న ప్రచారమంతా అబద్ధమని కొట్టిపారేశారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని ముందే నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తాను ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయనని పార్టీ కోర్ కమిటీకి (Core Committee) రాతపూర్వకంగా ముందే తెలియజేసినట్లు స్పష్టం చేశారు. తాను పోటీ చేయనని చెప్పినప్పుడు నాయకత్వం టికెట్ ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు.
తాను ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ (NDA) అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని భావిస్తున్నట్లు అన్నామలై తెలిపారు. తన నిర్ణయాన్ని గౌరవించినందుకు పార్టీ హైకమాండ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపై పూర్తి సమయాన్ని కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు కేటాయిస్తానని ఆయన ప్రకటించారు. అన్నామలై వివరణతో గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది.