
పామూరు, సూర్య న్యూస్: కన్నకూతురిని ప్రయోజకురాలిని చేయాలనుకున్న ఆ తండ్రి ఆశలు అడియాశలయ్యాయి. తనను నమ్మించి మోసం చేయడమే కాకుండా, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్న కిరాతకుడి వేధింపులు భరించలేక ఓ టీచర్ బలవన్మరణానికి పాల్పడింది. మరణించే ముందు తన అరచేతిపై “Sorry నాన్న.. జాగ్రత్త” అని రాసుకుని ఆమె తనువు చాలించడం ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. ఈ ఘటనలో నిందితుడు షేక్ నాగూర్ బాషాను పామూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
మార్కాపురం జిల్లా పామూరు మండలంలోని అయ్యవారిపల్లికి చెందిన బోడ మాధవి (24) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. అదే స్కూల్లో నిందితుడు నాగూర్ బాషా పిల్లలు చదువుతుండటంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు, ఆమెతో మాట్లాడిన ప్రైవేట్ వీడియో కాల్స్ను రహస్యంగా రికార్డ్ చేశాడు. కొంతకాలంగా ఆ న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని, నీ పరువు తీస్తానని మాధవిని మానసిక క్షోభకు గురిచేశాడు.
నిందితుడి వేధింపులు మితిమీరడంతో, పరువు పోతుందనే భయంతో మాధవి మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అయితే చనిపోయే ముందు తన తండ్రి పట్ల ఉన్న మమకారాన్ని, ఆయనను ఒంటరిని చేస్తున్నాననే బాధను తన అరచేతిపై అక్షరబద్ధం చేసింది. “సారీ నాన్న.. జాగ్రత్త” అంటూ ఆమె రాసుకున్న ఆఖరి మాటలు చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు నాగూర్ బాషాను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.