
రాంబిల్లి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (AP CM) నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఇకపై విద్యుత్ (Electricity) చార్జీలు పెంచబోమని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ కరెంట్ చార్జీలు పెంచబోమని ఆయన ప్రజలకు కీలక హామీ ఇచ్చారు.
గ్రీన్ ఎనర్జీపై భారీ పెట్టుబడులు
రాంబిల్లి (Rambilli) మండలంలో రెన్యూ గ్లోబల్ సంస్థ (Renew Global) ఏర్పాటు చేయనున్న సోలార్ ఇంగోట్ వేపర్ కేంద్రానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ (Green Energy) ప్రాజెక్టుల కోసం ఏపీలో లక్షా 85 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రతి ఇల్లు ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. రైతులు సైతం తమ వ్యవసాయ పొలాల వద్దే విద్యుత్ ఉత్పత్తి చేసుకునే స్థాయికి ఎదగాలని ఆయన సూచించారు. తమ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన విద్యుత్ను తిరిగి గ్రిడ్కు అందించే స్థాయికి ప్రజలు చేరాలని ఆయన ఆకాంక్షించారు.
ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు
రాష్ట్ర రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) కి త్వరలో 1050 ఎలక్ట్రిక్ బస్సులు (EV Buses) రానున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులన్నింటినీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని ఆయన తెలిపారు. పేదలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి తేవడం కోసమే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు.
గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిందని ముఖ్యమంత్రి విమర్శించారు. గత పాలకులు ప్రజలపై 32 వేల కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపారని ఆయన మండిపడ్డారు. విద్యుత్ డిస్కంల నష్టాలకు సంబంధించిన 15 వేల 700 కోట్లను ప్రస్తుత ప్రభుత్వమే భరించిందని ఆయన తెలిపారు. ట్రాన్స్ మిషన్ లాస్, టూ డౌన్ చార్జెస్ తగ్గించడం ద్వారా ప్రజలపై భారం పడకుండా చూశామని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Speed of Doing Business) విధానంతో పెట్టుబడులను వేగంగా ఆకర్షిస్తోందని ఆయన వివరించారు.
జూలైలో భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం
వచ్చే జూలై మొదటి వారంలో భోగాపురం ఎయిర్ పోర్ట్ (Bhogapuram Airport) ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. వర్షాలు ప్రారంభమైన వెంటనే ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు (Godavari Waters) అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ హైవే విస్తరణ పనులను సైతం త్వరలోనే మొదలు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.