
చెన్నై, సూర్య న్యూస్: తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వానికి అన్నాడీఎంకే (AIADMK) కు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (EPS) తీరుకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే పార్టీలో భారీ చీలిక ఏర్పడింది.
సీనియర్ నేత సి.వి. షణ్ముగం (CV Shanmugam) నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేల బృందం మంగళవారం ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. బుధవారం అసెంబ్లీలో విజయ్ (Thalapathy Vijay) ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉన్న తరుణంలో ఈ పరిణామం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో నిలిచింది. కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల సహకారంతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు షణ్ముగం నేతృత్వంలోని 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సైతం తోడవడంతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతం అయింది.
తాజాగా చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో షణ్ముగం మాట్లాడారు. ప్రజలు విజయ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారని ఆయన తెలిపారు. ఆ ప్రజా తీర్పును గౌరవిస్తూనే తాము టీవీకే ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. అదే సమయంలో పార్టీ అధినేత పళనిస్వామి తీరుపై పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. గత కొన్ని ఎన్నికలుగా అన్నాడీఎంకే వరుస ఓటములను చవిచూస్తోందని గుర్తు చేశారు. 2019 లోక్ సభలో ఒక సీటు, 2021 అసెంబ్లీలో 75 సీట్లు, 2024 పార్లమెంటు ఎన్నికల్లో సున్నా, తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం 47 స్థానాలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నాడీఎంకేను కాపాడుకోవడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పార్టీని చీల్చే ఉద్దేశం లేదని షణ్ముగం తెలిపారు. అయితే టీవీకే కూటమిని ఎదుర్కొనేందుకు డీఎంకే (DMK) తో పొత్తు పెట్టుకోవాలన్న ఈపీఎస్ ప్రతిపాదనను మెజారిటీ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారని వెల్లడించారు. డీఎంకే వంటి దుష్ట శక్తిని అంతం చేయడానికే ఎంజీఆర్ (MGR) అన్నాడీఎంకేను స్థాపించారని గుర్తుచేశారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో అన్నాడీఎంకే తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించారు. ఈ నిర్ణయం వల్లే తాము ఈపీఎస్ ప్రతిపాదనను తిరస్కరించి, విజయ్ కు మద్దతు ఇవ్వాలని తీర్మానించినట్లు తెలిపారు.
ప్రస్తుతం అన్నాడీఎంకేలో ఈపీఎస్ వెనుక కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మిగతా 30 మంది షణ్ముగం వైపు చేరారు. షణ్ముగం బృందం ఎస్.పి. వేలుమణిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. జి. హరిని ఉపనేతగా ఎన్నుకున్నారు. అలాగే ప్రస్తుతం తమ పార్టీకి బీజేపీ (BJP) తో సైతం ఎటువంటి సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. వరుస ఓటములపై చర్చించేందుకు జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఈపీఎస్ ను కోరినట్లు షణ్ముగం తెలిపారు. జయలలిత (Jayalalithaa) మరణం తర్వాత ఉనికి కోసం పోరాడుతున్న అన్నాడీఎంకేకు ఈ పరిణామం కోలుకోలేని దెబ్బగానే కనిపిస్తోంది.