
Hyderabad, Surya News: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) కు భారీ ఊరట లభించింది. ఆయన కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) పై నమోదైన పోక్సో కేసు (POCSO Case) వ్యవహారంలో మంత్రిని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ప్రచారానికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు (Hyderabad City Civil Court) బ్రేక్ వేసింది. ఈ మేరకు సంచలన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
శుక్రవారం బండి సంజయ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన కుమారుడిపై నమోదైన పోక్సో కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కోర్టుకు (Court) తెలిపారు. ఈ వివాదంలో తన పేరును ఎక్కడా ఉపయోగించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో మీడియా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ (Social Media Platforms) లో తన పేరు వాడకుండా నిలువరించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటివరకు తన పేరుతో సర్క్యులేట్ అయిన వీడియోలను (Videos) తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్ పై స్పందించిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ లక్ష్యంగా కొనసాగిస్తున్న ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఆయనను టార్గెట్ చేస్తూ ప్రసారం చేసిన వీడియో క్లిప్పింగ్స్, పత్రికా కథనాలు, డిజిటల్ కంటెంట్ (Digital Content), వాల్ పోస్టర్లను తొలగించాలని ఆదేశించింది. ఈ నెల 26 లోపు వాటిని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని మధ్యంతర ఉత్తర్వులు (Interim Orders) జారీ చేసింది. ఇకపై ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది.
కాగా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (Cyberabad Police Commissionerate) పరిధిలో కేసు నమోదైంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు ఫైల్ అయిన సంగతి తెలిసిందే. ఒక మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు (Police) ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.