Skip to content

IPL 2026 : పటిదార్ ఊచకోత.. గుజరాత్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆర్‌సీబీ

ధర్మశాల, సూర్య న్యూస్: ఐపీఎల్ (IPL 2026)లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి తన జోరును చాటుకుంది. లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరిన ఈ జట్టు.. ఇవాళ జరిగిన తొలి క్వాలిఫైయర్ (Qualifier 1) మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT)ను చిత్తుగా ఓడించింది. దీంతో వరుసగా రెండో ఎడిషన్‌లోనూ ఫైనల్స్ (IPL Finals)కు దూసుకెళ్లి తన టైటిల్ వేటను సిద్ధం చేసుకుంది.

ధర్మశాల వేదికగా జరిగిన ఈ కీలక పోరులో ఆర్‌సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా కెప్టెన్ రజత్ పటిదార్ (Rajat Patidar) మహోగ్రరూపం దాల్చాడు. గుజరాత్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల అతి భారీ స్కోరు సాధించింది. ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో పటిదార్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వెంకటేష్ అయ్యర్ 7 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 19 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ (Virat Kohli) 25 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 పరుగులు జోడించాడు. అలాగే పడిక్కల్ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30 పరుగులు.. కృనాల్ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేశారు. చివర్లో టీమ్ డేవిడ్ 5 బంతుల్లో 4 పరుగులు.. జితేశ్ శర్మ 5 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో హోల్డర్, రబాడ తలో 2 వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు.

అనంతరం 255 పరుగుల కష్టసాధ్యమైన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఆదిలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. సాయి సుదర్శన్ (14) దురదృష్టవశాత్తూ హిట్ వికెట్‌గా వెనుదిరగడంతో ఆ జట్టు పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (2), 51 పరుగుల వద్ద జోస్ బట్లర్ (29), నిశాంత్ సింధు (5), హోల్డర్ (0) ఔట్ కావడంతో పవర్ ప్లేలోనే (5.4 ఓవర్లలో) గుజరాత్ ఓటమి ఖరారైంది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే సుందర్ (8), రషీద్ ఖాన్ (8), రబాడ (9) కూడా వెనుదిరగడంతో 100 పరుగులలోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. అయితే ఆఖర్లో రాహుల్ తెవాతియా (68) బ్యాట్ ఝులిపించడంతో జట్టు స్కోరు 100 పరుగుల మార్కును దాటింది. అంతిమంగా గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయి 92 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఆర్‌సీబీ బౌలర్లలో యశ్ దయాల్ 3 వికెట్లు.. భువీ, రసిక్, కృనాల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్ ఒక వికెట్ తీసి గుజరాత్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.

మీ అభిప్రాయం తెలియజేయండి.