- మునుగోడు లో రెండున్నరేళ్ల ముందే వేడెక్కినరాజకీయం..
- లోకల్ నినాదంతో రాజగోపాల్రెడ్డి లక్ష్యంగా విమర్శనాస్త్రాలు

మునుగోడు, (సూర్య న్యూస్ తెలుగు): సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉండగానే, మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కింది. బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా చురుకయ్యారు. నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తూ అటు కాలికి, ఇటు నోటికి పనిచెబుతున్నారు. జనంలో తిరుగుతూ ‘తాను లోకల్’ అని ప్రచారం చేసుకుంటూనే.. మునుగోడు స్థానిక సమస్యలపై, ప్రజా సమస్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తద్వారా ప్రజల దృష్టిని పూర్తిగా తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సీటు పదిలం చేసుకునే వ్యూహంలో భాగమేనా?

కూసుకుంట్ల ఆకస్మిక దూకుడు వెనుక భవిష్యత్ రాజకీయ వ్యూహాలే కారణమని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మునుగోడు బీఆర్ఎస్ లోకి ఇతర నాయకులు చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తోడు పార్టీలో ఉన్న ఇతర నేతలు సైతం సీటుపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ మరొకరికి అవకాశం ఇస్తే తనకు రాజకీయంగా తలుపులు మూసుకుపోతాయన్న ఆందోళన ఆయనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగి మునుగోడు రెండు ముక్కలైతే, ఎటువైపు అయినా సరే తన సీటును పదిలం చేసుకునే క్రమంలో ఇప్పటి నుంచే ఆయన క్షేత్రస్థాయిలో అనుచరగణాన్ని కూడగడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మెల్లగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి దీటైన ప్రత్యామ్నాయ అభ్యర్థిని తానేనని పార్టీకి, ప్రజలకు నిరూపించుకునేందుకే ఆయన స్పీడ్ పెంచారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రేవంత్, రాజగోపాల్ రెడ్డిలపై ఘాటు విమర్శలు..

పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే క్రమంలో కూసుకుంట్ల అధికార పార్టీపై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్.. నిధులు, నీళ్ల గురించి ఏమీ మాట్లాడకుండా కేవలం బూతులు మాట్లాడి వెళ్లారని దుయ్యబట్టారు. “ముఖ్యమంత్రి పదవి అనే టోపీ రేవంత్ నెత్తిపై ఉంటే.. ఆయనను నడిపించే లాఠీ మాత్రం ఆంధ్రా నాయకుడు చంద్రబాబు నాయుడి చేతిలో ఉంది” అని ఎద్దేవా చేశారు.
స్థానిక మంత్రులు, కాంగ్రెస్ నేతల తీరు ఊర కుక్కల కన్నా కొద్దిగా ఎక్కువ, పిచ్చి కుక్కల కన్నా తక్కువ అన్నట్లుగా తయారైందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని ‘గోల్ మాల్ గోపాల్’ అని, ఆయన సోదరుడిని ‘పొంకనాల పోశిగాడు’ అని ఎద్దేవా చేశారు. మంత్రులెవరూ కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని, వంద మార్కులు వేసుకోవాలని వారు కలలు కంటున్నారని.. కానీ ప్రజలు వారికి ‘జీరో(0)’ మార్కులు వేయడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. దమ్ముంటే, తమ పాలనపై నమ్మకం ఉంటే.. తక్షణమే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు రావాలని కూసుకుంట్ల సవాల్ విసిరారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



