
రాజమహేంద్రవరం, సూర్య న్యూస్: ఆధునిక ఆంధ్రదేశ చరిత్రలో ఒక కొత్త శకాన్ని లిఖించిన మహనీయుడు. సమాజంలోని అంధకారాన్ని తొలగించి జ్ఞాన దీపాలను వెలిగించిన సంస్కరణాభిలాషి. ఆయనే దక్షిణ భారత విద్యాసాగరుడు (Ishwar Chandra Vidyasagar of South), గద్య తిక్కన కందుకూరి వీరేశలింగం పంతులు (Kandukuri Veeresalingam Panthulu). నేడు ఆయన జయంతి (April 16) సందర్భంగా తెలుగు జాతి ఆ మహనీయుడిని స్మరించుకుంటోంది.
జననం మరియు నేపథ్యం:
1848 ఏప్రిల్ 16న రాజమహేంద్రవరంలో జన్మించిన వీరేశలింగం గారు కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అప్పట్లో సమాజంలో వేళ్లూనుకున్న బాల్య వివాహాలు (Child Marriages), సతీసహగమనం, వితంతువుల దుర్భర స్థితిని చూసి ఆయన చలించిపోయారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా చేతలతో మార్పు తెచ్చారు.

సామాజిక సంస్కరణలు:
1881 డిసెంబర్ 11న ఆంధ్రదేశంలో మొట్టమొదటి వితంతు వివాహాన్ని (Widow Remarriage) జరిపించారు. దాదాపు 40కి పైగా వితంతు వివాహాలు చేసి సమాజంలో విప్లవం తెచ్చారు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాలతో మూఢాచారాలను ఎదిరించారు.
స్త్రీ విద్య:
దౌలేశ్వరంలో తొలి బాలికా పాఠశాల స్థాపన. స్త్రీలు విద్యావంతులైతేనే సమాజం బాగుపడుతుందని నమ్మిన వ్యక్తి.
తొలి నవల:
ఆయన రాసిన ‘రాజశేఖర చరిత్రము’ (1880) తెలుగులో మొట్టమొదటి నవల. ఇది సామాజిక స్థితిగతులపై వ్యంగ్య అస్త్రం.
ఆత్మకథ:
తన జీవిత విశేషాలను ‘స్వీయ చరిత్రము’ పేరుతో తెలుగులో మొదటి ఆత్మకథగా మలిచారు.
వ్యంగ్య రచనలు:
సమాజంలోని కుళ్లును కడిగిపారేయడానికి ‘బ్రహ్మ వివాహం’, ‘అభాగ్యోపాఖ్యానము’ వంటి ప్రహసనాలను రాశారు.
పత్రికా రంగం:
వివేకవర్ధిని, సతీహిత బోధిని, హాస్య సంజీవిని పత్రికల ద్వారా అవినీతిపై పోరాటం, స్త్రీ చైతన్యం కోసం కృషి చేశారు.

నిరంతర సేవ:
రాజమండ్రిలో ‘హితకారిణి సమాజం’ (Hitakarini Samajam) స్థాపించి తన యావదాస్తిని సమాజ శ్రేయస్సు కోసమే ధారపోశారు. ఆయన చేసిన అలుపెరగని కృషి ఫలితంగానే నేడు తెలుగు రాష్ట్రాల్లో స్త్రీ విద్య, సామాజిక సమానత్వం వంటి అంశాలు ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 1919 మే 27న ఆయన భౌతికంగా దూరమైనా, ఆయన రాసిన ప్రతీ అక్షరం, చేసిన ప్రతీ సంస్కరణ నేటికీ సజీవంగానే ఉన్నాయి.