
న్యూఢిల్లీ, సూర్య న్యూస్: లోక్ సభలో (Lok Sabha) మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మహిళల కలను ప్రతిపక్షాలు (Opposition Parties) చిదిమేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు గాను దేశంలోని మహిళలందరికీ తాను క్షమాపణలు చెబుతున్నానని ప్రధాని స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్లను (Women’s Reservation) అడ్డుకునేందుకు విపక్షాలు ఏ విధంగా ప్రయత్నించాయో దేశం మొత్తం చూసిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ (Congress), డీఎంకే (DMK), టీఎంసీ (TMC), ఎస్పీ (SP) పార్టీల స్వార్థ రాజకీయాలకు మహిళా లోకం బలైనట్లు ఆయన పేర్కొన్నారు. నారీశక్తిని ఎదగకుండా ఈ పార్టీలు అడ్డుకున్నాయని విమర్శించారు. మహిళల కలలను ప్రతిపక్షాలు ధ్వంసం చేశాయని ప్రధాని మండిపడ్డారు. మహిళా బిల్లును ఓడగొట్టి విపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
రిజర్వేషన్లను అడ్డుకోవడం ద్వారా వారు పాపం చేశారని దుయ్యబట్టారు. ఇది మహిళల ఆత్మాభిమానంపై జరిగిన దాడి అని ఆయన వర్ణించారు. ఈ అన్యాయాన్ని మహిళలు ఎప్పటికీ మరిచిపోరని ఆయన గుర్తు చేశారు. రిజర్వేషన్లను అడ్డుకున్న వారిని మహిళలు తప్పకుండా శిక్షిస్తారని ఆయన హెచ్చరించారు. ఈ చర్యను ఆయన భ్రూణహత్యలతో సమానంగా అభివర్ణించారు. ఈ పాపంలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే తదితర పార్టీలు పాలుపంచుకున్నాయని ఆయన ఆరోపించారు. ఇవన్నీ కేవలం కుటుంబ పార్టీలు (Family Parties) అని విమర్శించారు.
కుటుంబ పార్టీలు మహిళలను ఎదగనీయవని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల కోసం మహిళలు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని ఆయన గుర్తు చేశారు. దీని కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారని తెలిపారు. ఎంతో నిజాయితీతో తీసుకువచ్చిన బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కోటా (Women Quota) బిల్లును వ్యతిరేకించడంలో ప్రతిపక్షం చేసిన పాపానికి కచ్చితంగా శిక్ష తప్పదని ప్రధాని మోడీ (PM Modi) తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.