
హైదరాబాద్, సూర్య న్యూస్: తన సొంత భూమిలో అడవిని సృష్టించిన ప్రముఖ పర్యావరణవేత్త (Environmentalist), జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్శర్ల సత్యనారాయణ (Dussharla Satyanarayana) పై దారుణ దాడి జరిగింది. ఆయన పెంచిన చెట్లను నరుకుతుంటే అడ్డుకున్నందుకు కొందరు ఆయనపై కర్రలు, గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి (NIMS Hospital) లో చికిత్స పొందుతున్నారు.

సూర్యాపేట జిల్లా (Suryapet District) మోతె మండలం రాఘవపురం గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సత్యనారాయణకు పూర్వీకుల నుంచి 70 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. ఆ భూమిని అమ్ముకోకుండా గడచిన పలు దశాబ్దాలుగా అందులో లక్షలాది మొక్కలు నాటి దట్టమైన అడవి (Forest) గా మార్చారు. పశుపక్ష్యాదులకు ఆవాసంగా మారిన ఆ అడవిలోని చెట్లను నరికేందుకు స్థానికులు కొందరు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన వృద్ధుడైన సత్యనారాయణపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో యువకులు, మహిళలు కూడా పాల్గొనడం గమనార్హం. ఉమ్మడి నల్గొండ జిల్లా (Nalgonda District) లో ఫ్లోరైడ్ బాధితుల పక్షాన నిలబడి ఆయన ఎన్నో పోరాటాలు చేశారు.

నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ సమతుల్యత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తిపై దాడి జరగడం చాలా దురదృష్టకరం అని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ఆయన త్వరగా కోలుకుని మళ్ళీ పర్యావరణ సేవలో ముందుకు రావాలని మంత్రి ఆకాంక్షించారు.
